అత్యాచారం జరిగిందంటూ అబద్దం.. ఆటోవాలాకు నరకం, చివరకు..
ఇంటరాగేషన్లో ఓ ఆటోడ్రైవర్ మానసికంగా కృంగిపోయి.. తానే నేరం చేశానని ఒప్పుకొన్నట్లు సమాచారం.
ఓ యువతి చెప్పిన అబద్ధం... కొందరు ఆటోవాలాలకు నరకం కనిపించింది. తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు పిట్టకథలు చెప్పి నమ్మించింది. చివరకు ఆమె చెప్పినవన్నీ అబద్ధం అని తెలియడంతో.. సదరు యువతిపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
కాగా.. సదరు యువతి ఆడిన కిడ్నాప్ డ్రామా.. మొత్తం తెలియడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో యూనియన్లు కూడా.. కరోనా లాక్డౌన్తో ఉపాధి లేక.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న అభం శుభం తెలియని ఐదుగురు ఆటో డ్రైవర్లను ఇబ్బందికి గురిచేసిన సదరు యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటరాగేషన్లో ఓ ఆటోడ్రైవర్ మానసికంగా కృంగిపోయి.. తానే నేరం చేశానని ఒప్పుకొన్నట్లు సమాచారం. అయితే.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన బృందం, అతను చెబుతున్న వివరాలకు పొంతన లేకపోవడంతో యువతిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఉన్నతాధికారులకు ఇదే విషయాన్ని తెలపడంతోపాటు ఘటన జరిగిన సమయంలో సదరు ఆటోడ్రైవర్ నారపల్లి సమీపంలోని ఓ మల్టిప్లెక్స్కు, ఆ తర్వాత ఓ బార్కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. దీంతో.. ఆ యువతి రాంపల్లి చౌరస్తా నుంచి ఎక్కడికి వెళ్లింది? అనే కోణంలో 120 సీసీటీవీలను జల్లెడ పట్టారు. ఆమె నాటకమాడుతోందని నిగ్గుతేల్చారు.