రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్: నకిలీ నోట్ల బిజినెస్ చేస్తున్న మురళీకృష్ణ
రంగురాళ్ల పేరుతో నకిలీ నోట్ల బిజినెస్ చేస్తున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్:రంగురాళ్ల పేరుతో నకిలీ నోట్ల బిజినెస్ చేస్తున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.అస్ట్రాలజిస్ట్గా చెప్పుకొంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈ నెల 15వ తేదీన దొంగతనం జరిగింది. తన ఇంట్లో సుమారు రూ. 40 లక్షల విలువైన జాతిరత్నాలు దొంగిలించారని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. మురళీకృష్ణపై గతంలో సీబీఐ కేసు నమోదైన విషయాన్ని గుర్తించారు. మురళీకృష్ణ గతంలో 90 కోట్లను హవాలా ద్వారా మళ్లించారని కేసు నమోదు చేసింది. ఈ కేసులో జైలు నుండి విడుదలయ్యారు.
నాగోల్ బండ్లగూడలో బెల్లంకొండ మురళీకృష్ణ ఆస్ట్రాలజిస్టుగా చెప్పుకొంటూ రంగురాళ్లను విక్రయించేవాడు. ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలోనే మురళీకృష్ణ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నాడని గుర్తించారు. మురళీకృష్ణ ఇంటి నుండి రూ. 17 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు.మురళీకృష్ణ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. వారి నుండి రూ. 32 వేల నగదు, ఒక కట్టర్, 10 మొబైల్స్, నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకొన్నారు ఎల్బీనగర్ పోలీసులు.