సీఎం కేసీఆర్ చనిపోయారంటూ ప్రచారం.. యువకుడి అరెస్ట్
మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్ను రాజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జూన్ 8వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ యువకుడు అసత్య ప్రచారం చేశాడు. ముక్కు ద్వారా కరోనా వైరస్ సోకి.. కేసీఆర్ చనిపోయాడంటూ ప్రచారం చేశాడు. కాగా.. సదరు యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నగరానికి చెందిన పన్యాల రాజు అనే యువకుడు ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించాడని, గాంధీ హాస్పిటల్ వైద్యులు దీనిని ధ్రువీకరించారని ఫేస్బుక్లో ఫేక్ పోస్ట్ చేశాడు. మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్ను రాజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జూన్ 8వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించారు.
జగిత్యాలకు చెందిన రాజు సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అయితే ఈనెల 14వ తేదీన రాజు సౌదీ నుండి ఇండియాకు వచ్చాడు. ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన రాజును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు అధికారుల సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వెళ్లి రాజును హైదరాబాద్కు తీసుకువచ్చారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు.