ఆలయంలో చోరీకి వచ్చి.. అక్కడే నిద్రపోయి..!
అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా.. అమ్మవారి వెండి వడ్డాణం, త్రిశూలం, కత్తి, వస్త్రాలు కనిపించాయి.
ఓ బాలుడు ఆలయంలో నగలు కాజేయాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆలయంలోకి దూరి నగలు చోరీ చేశాడు. అయితే.. ఆ తర్వాత అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఈ సంఘటన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రాయణగుట్ట ఠాణాకు సమీపంలలో ఉన్న శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీరామాలయం ఆవరణలో సాయిబాబా, దుర్గ భవాని, స్వయంభువు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆదివారం సాయిబాబా మందిరం పూజారి తలుపులు తీయగగా.. లోపల ఓ బాలుడు నిద్రపోయి కనిపించాడు.
వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధి ప్రభాకర్ రాజుకు సమాచారం ఇచ్చి.. సదరు బాలుడిని నిద్రలేపారు. అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా.. అమ్మవారి వెండి వడ్డాణం, త్రిశూలం, కత్తి, వస్త్రాలు కనిపించాయి. బాలుడిని నిలదీయగా.. ఆలయంలో చోరీ చేశానని.. నిద్రరావడంతో అక్కడే పడుకున్నానని చెప్పాడు.
సమాచారం మేరకు చంద్రాయణగుట్ట పోలీసులు పరిశీలించారు. అర్థరాత్రి స్లాబ్ నుంచి మెట్ల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు బాలుడు తెలిపాడు. ఆలయంలో హుండీ, అల్మారా తాళాలు పగలకొట్టి అమ్మవారి నగలు చోరీ చేశాడు. దాదాపు అర్థరాత్రి 2గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.