భక్తి పేరిట భారీ మోసం.. రూ.30లక్షలకు టోకరా..!
ఆ తర్వాత ఈ-మెయిల్ పంపి.. రూ. 4 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను పంపుతున్నట్లు పేర్కొన్నాడు. వాటిని భారత్లో పేదల సంక్షేమానికి వినియోగించాలని కోరాడు. దాంతో ఆ యువతి సరేనంది. ఆ తర్వాత ఆమెకు సోనియా శర్మ అనే యువ తి నుంచి ఫోన్ వచ్చింది.
భక్తి భావాలు ఎక్కువగా ఉన్న ఓ యువతికి.. ఆ భక్తి పేరుతోనే ఓ ముఠా మోసం చేసింది. ఇప్పటికే.. నగరంలో చాలా సైబర్ మోసాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా.. తాజాగా.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ.4కోట్లు ఇస్తామంటూ నమ్మించి ఓ యువతి వద్ద నుంచి ఓ ముఠా దాదాపు రూ.29.74 లక్షలు కాజేసింది. ఆలస్యంగా మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముఠా గుట్టుని రట్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... సఫిల్గూడ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ భక్తి సంబం ధించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఆమె వాట్సాప్ నంబరుకు +44 కంట్రీకోడ్ నుంచి చిబూకే క్రిస్టియన్ అనే వ్యక్తి మెసేజ్ చేశాడు. మీ ఆధ్యాత్మిక భావాలు నన్ను కట్టిపడేశాయంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
ఆ తర్వాత ఈ-మెయిల్ పంపి.. రూ. 4 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను పంపుతున్నట్లు పేర్కొన్నాడు. వాటిని భారత్లో పేదల సంక్షేమానికి వినియోగించాలని కోరాడు. దాంతో ఆ యువతి సరేనంది. ఆ తర్వాత ఆమెకు సోనియా శర్మ అనే యువ తి నుంచి ఫోన్ వచ్చింది.
‘‘కస్టమ్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నా.. మీకు అమెరికా నుంచి పార్శిల్ వచ్చింది. అందులో రూ. 4 కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లున్నాయి. మీకు ఆ పార్శిల్ అందాలంటే.. ఆర్బీఐ క్లియరెన్స్, జీఎస్టీ, కస్టమ్స్ చార్జీలు, బీమా చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది.వారు చెప్పింది నిజమనుకొని నమ్మి సదరు యువతి వారికి దాదాపు రూ.30లక్షలు చెల్లించింది.
వారు చెప్పిన డబ్బు మొత్తం చెల్లించినా.. పార్శిల్ రాకపోవడంతో.. సోనియాకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్లు స్విచాఫ్ అయ్యి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించి.. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన సైబర్క్రైమ్స్ బృందం.. త్రిపుర, కోల్కతా, ఢిల్లీలకు చెందిన ఖాతాలకు బాధిత యువతి నుంచి డబ్బు వెళ్లినట్లు గుర్తించింది. చిబూకే క్రిస్టియన్ అరిరిగుబునాము అనే నైజీరియా దేశస్థుడిని ఢిల్లీలో అరెస్టు చేసింది. పోలీసులు అరెస్టు చేసే సమయంలో.. నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో.. ఓ ఏఆర్ఎస్సై, ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అరెస్టు సమయంలో.. నిందితుడు చిబూకే తెలుగులో మాట్లాడడం గమనార్హం. ఈ మోసంలో చిబూకేకు సహకరించిన అరుణ్కుమార్ అనే వ్యక్తిని కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. మరో నిందితురాలు సోనియాశర్మ పరారీలో ఉంది.