ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సమీపంలోని హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సమీపంలోని హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ 9.30 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా.. అందుకు 10 నిమిషాల ముందుగానే ఆయన విమానం అక్కడికి చేరుకుంది. హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకన్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:15 గంటలకు వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకోనున్నారు. 

ప్రధాని మోదీ తొలుత భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం వరంగల్ ర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ రూ. 6,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అందులో రూ. 521 కోట్లతో వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమకు, రూ. 3,441 కోట్ల ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు, రూ. 2,147 కోట్లతో జగిత్యాల- కరీంనగర్‌- వరంగల్‌ ఇంటర్ కారిడార్ పనులు ఉన్నాయి. తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు విజయసంకల్ప సభగా నామకరణం చేశారు. ఈ సభావేదికపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్, సీఎం కేసీఆర్‌లతో సహా మొత్తం 8 మంది మత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు.

ఈ సభ అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తన ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయలుదేరుతారు. ఇక, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్ భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.