PM Modi Hyderabad Visit: కేసీఆర్ కుటుంబానిది రాజకీయ సర్కస్.. సీఎంపై స్మృతి ఇరానీ ఫైర్
Smriti Irani: హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగత పలకాడానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ సర్కస్ అంటూ ఫైర్ అయ్యారు.
PM Modi Hyderabad Visit: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం నుంచి రెండు రోజుల పాటు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికార ప్రతినిధులు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా శనివారం నాడు హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీని ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వెళ్లలేదు. దీంతో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదివరకు కూడా ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. అంతకుముందు, రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ సెల్స్ మెన్ అంటూ విమర్శించారు. మేక్-ఇన్-ఇండియా వాదనలు అబద్ధమని అన్నారు. ఇక ప్రధాని వచ్చిన స్వాగతం పలకడానికి రాని కేసీఆర్.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడానికి కొన్ని గంటల ముందు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో కలిసి ర్యాలీగా ఉందుకు సాగారు. ఇది బీజేపీ నేతలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి వ్యవస్థను అవమానించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వ్యవస్థను (సంస్థను) అవమానించారు. రాజ్యాంగ సమగ్రతను దెబ్బతీశాడు. రాజకీయాలు కేసీఆర్ పార్టీకి సర్కస్ కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు ఇది సామాజిక విముక్తి మరియు దేశ నిర్మాణానికి మాధ్యమం”అని స్మృతి ఇరానీ అన్నారు. భారతదేశం అంతటా అనుసరించాల్సిన అభివృద్ధి నమూనా తెలంగాణలో ఉందని కేసీఆర్ చెప్పడాన్ని ఆమె సవాలు చేశారు. కుటుంబానికి సేవ చేయడం ఒక బాధ్యత అని భావించే ప్రధానమంత్రిని స్వీకరించే బాధ్యతను నిర్వర్తించని సంస్థ దేశానికి ఎప్పటికీ రోల్ మోడల్ కాజాలదని పేర్కొన్నారు. రాజ్యాంగం గౌరవాన్ని దెబ్బతీసేవాడు నియంత అని, నేడు కేసీఆర్ నియంతలా మారారని ఆమె మండిపడ్డారు.
జాతీయ కార్యవర్గ సమావేశం గురించి ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. అక్కడ మోడీ ప్రభుత్వ పేద సంక్షేమ విధానాలను ప్రస్తావించారు. గత ఎనిమిదేళ్లలో, మా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పని చేసింది. దేశానికి సేవ చేయడంలో యువతకు సహాయం చేసింది” అని స్మృతి ఇరానీ తెలిపారు. దాదాపు 45 కోట్ల మందికి ఆర్థిక సాయం అందించిన జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాలతో పాటు సామాజిక సేవా పథకాలు, రైతులకు సంబంధించిన విధానాలను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు విపులంగా మాట్లాడారు. కాగా, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో బీజేపీ ఎలాగైనా రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలు, ప్రత్యేక రోడ్ మ్యాప్ ను కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.