మంత్రాల నెపంతో దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన వృద్దుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి : ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగుతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలోనూ కొన్ని గ్రామాలు మూడనమ్మకాల్లో మగ్గిపోతున్నాయి. గ్రామీణ ప్రజలు అమాయకత్వంతో ఇప్పటికీ తాంత్రిక పూజలను నమ్ముతున్నారు. అనారోగ్యం బారినపడితే హాస్పిటల్స్ కు వెళ్లకుండా బాబాలు, మంత్రగాళ్ల వద్దకు వెళ్లేవారూ వున్నారు. ఇలా తన భార్య అనారోగ్యానికి కారణమయ్యాడని ఓ వృద్దుడి చితకబాది అందరిముందూ అవమానించాడో వ్యక్తి. ఇది తట్టుకోలేక వృద్దుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఎర్ర నవీన్, పావని నివాసం వుంటున్నారు. ఇటీవల తన భార్య అనారోగ్యానికి గురవడంతో నవీన్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినా పావని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఎవరో క్షుద్రప్రయోగం చేస్తున్నారని అనుమానించాడు. అదే గ్రామానికి చెందిన ఎడ్ల బాలరాజు(75) ఈ పని చేస్తున్నాడని అనుమానించిన నవీన్ దారుణంగా ప్రవర్తించాడు.
బాలరాజును ఒంటరిగా పట్టుకున్న నవీన్ మరో ముగ్గురితో కలిసి దారుణంగా చితకబాదాడు. క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ అందరిముందే బూతులు తిట్టారు. గ్రామస్తులందరి ముందు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దాడి అనంతరం బాలరాజు నేరుగా గ్రామ శివారుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల కాపాడేవారు ఎవరూలేకపోవడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Read More మనోహరాబాద్లో చెరువులో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాల వెలికితీత, బాలుడి కోసం గాలింపు..
నోటినుండి నురగ కారుతూ పడివున్న బాలరాజు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతుడి భార్య బాలరాజవ్వ అక్కడికి చేరుకుని భర్త మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని బాలరాజు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పిర్యాదుమేరకు దాడిచేసిన నవీన్ తో పాటు రాము, రాజు, నర్సయ్యలపై పోలీసులు కేసు నమోదు చేసారు. తన భర్తను అవమానించి ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని బాలరాజవ్వ పోలీసులను కోరుతోంది.
