ఈటల అవినీతి పరుడు, అందుకే బీజేపీని వీడా: మోత్కుపల్లి నర్సింహులు
ఈటల రాజేందర్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజేందర్ ను బీజేపీలో చేర్చుకోవడం సరైందికాదన్నారు.
హైదరాబాద్: ఈటల రాజేందర్ అవినీతిపరుడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.ఆయనను బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందన్నారు.శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపానని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోబోతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు తనతో ఒక్కమాట కూడా చెప్పలేదని మండిపడ్డారు.
also read:తెలంగాణలో బిజెపికి షాక్: మోత్కుపల్లి రాజీనామా, కారు ఎక్కేందుకు రెడీ?
అసలు రాజేందర్ ను నెత్తిన మోయాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. దళితుల భూములను ఈటల ఆక్రమించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఈటలకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకోలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలను చెప్పాలని ఆహ్వానించారని బండి సంజయ్ కు చెప్పే తాను ఆ సమావేశానికి వెళ్లానని అయినా పార్టీలో వ్యతిరేక అభిప్రాయాలు రావడం తనకు బాధ కల్గించిందన్నారు. బీజేపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు.బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కలేదన్నారు. ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. దళిత బంథు పథకం తెచ్చిన కేసీఆర్ ను గౌరవించాలన్నారు.
రాజేందర్ ను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని ఆయన కోరారు. ఈ ఉప ఎన్నికల్లో గెలవడానికి వీల్లేదని ఆయన చెప్పారు.