Asianet News TeluguAsianet News Telugu

నందకుమార్ కు బెయిల్ మంజూరు: చంచల్ గూడ జైలు నుండి విడుదల

చంచల్ గూడ జైలులో  ఉన్న నందకుమార్ కు బెయిల్ మంజూరైంది. దీంతో  ఆయన చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. 

Nanda kumar Releases  From  Chanchalguda Jail
Author
First Published Jan 13, 2023, 9:47 AM IST

హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో  ఉన్న   నందకుమార్ కు  కోర్టు  బెయిల్ మంజూరు  చేసింది.  దీంతో  నందకుమార్  శుక్రవారం నాడు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు.ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో నందకుమార్  నిందితుడిగా  ఉన్న విషయం తెలిసిందే.  ఈ కేసులో  నందకుమార్, రామచంద్రభారతి, సింహాయాజీల కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  అయితే   మరో కేసులో  నందకుమార్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ కేసులో నందకుమార్ కు  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. 

నందకుమార్ కు  కోర్టు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  హైద్రాబాద్ విడిచి  వెళ్లొద్దని  కోర్టు ఆదేశించింది.  రూ.  10  వేల చొప్పున  రెండు పూచీకత్తులను  సమర్పించాలని  కోర్టు ఆదేశించింది.  కోర్టు ఆదేశాల మేరకు  పూచీకత్తులను  సమర్పించడంతో  చంచల్ గూడ జైలు నుండి  నందకుమార్  ఇవాళ విడుదలయ్యాడు.

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో హైకోర్టు  బెయిల్ మంజూరు చేయడంతో  ఇతర కేసుల్లో  రామచంద్రభారతి,  నందకుమార్ లను 2022 డిసెంబర్  6వ తేదీన  పోలీసులు అరెస్ట్  చేశారు. నందకుమార్ పై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన   చీటింగ్ , ఫోర్జరీ  కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.  ఫేక్ పాన్ కార్డు ,ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులో  రామచంద్రభారతిని  కూడ అరెస్ట్  చేశారు.  ఈ కేసులో  రామచంద్రభారతికి  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన  జైలు నుండి విడుదలయ్యాడు.  

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: రెండో రోజూ నందకుమార్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును ఈడీ విచారిస్తుంది . ఈ కేసు విషయమై జైలులో  ఉన్న నందకుమార్ ను విచారించేందుకు  అనుమతించాలని  ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించిన హైకోర్టు  ఈడీకి అనుమతినిచ్చింది.  ఈ కేసులో  గత ఏడాది డిసెంబర్  26, 27 తేదీల్లో  ఈడీ అధికారులు విచారించారు. 

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును  ఈడీ విచారణ చేయడాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.  మనీలాండరింగ్ జరిగితేనే  ఈడీ అధికారులు  విచారణ నిర్వహించాలని  రోహిత్ రెడ్డి వాదించారు.  ఏదో రకంగా  తనను కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారని  రోహిత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

2022 అక్టోబర్  26వ తేదీన  మొయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసినట్టుగా కేసు నమోదైంది.  అచ్చంపేట, కొల్లాపూర్ , పినపాక, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,  బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు,  పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది. పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించేందుకు  తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు  చేసింది. సిట్ విచారణను  సవాల్  చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించింది. సిట్ ను రద్దు చేస్తూ సీబీఐ విచారణకు   తెలంగాణ హైకోర్టు   గత ఏడాది డిసెంబర్ 26 న ఆదేశాలు  జారీ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios