కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు మాజీ టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు జరిగే తెలంగాణ స్ట్రాటజీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాను కాంగ్రెస్ను వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఉత్తమ్ సీరియస్ అయ్యారు. రేపు జరిగే తెలంగాణ స్ట్రాటజీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాగా.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో జోష్ వచ్చిన సంగతి తెలిసిందే. నేతలు సైతం విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. దీనికి తోడు బలమైన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరడంతో శ్రేణుల్లో ఎక్కడా లేని జోష్ నెలకొంది. దీంతో హస్తం పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని సీఎం కేసీఆర్ భావించారు. దీనిలో భాగంగా రివర్స్ ఆకర్ష్కు తెరదీశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో బలమైన నేతగా వున్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్లోకి తీసుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
Also Read: పార్టీ మార్పుపై వార్తలు .. పనిగట్టుకుని దుష్ప్రచారం, చట్టపరంగా ఎదుర్కొంటా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఉత్తమ్తో వద్దిరాజు రవీంద్ర మూడుసార్లు భేటీ అయినట్లుగా మీడియాలో విపరీతంగా కథనాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఓ ఫాంహౌస్లో భేటీ జరిగిందనేది వార్తల సారాంశం. అయితే కాంగ్రెస్ను వీడి రావాలంటే ఉత్తమ్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి. తనకు హుజుర్నగర్ , తన భార్య పద్మావతికి కోదాడ టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టారన్నది ఆ వార్తల సారాంశం. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరతానని కూడా ఉత్తమ్ ఆ భేటీలో చెప్పినట్లుగా ఈ కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
