నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ బదిలిస్తా అంటూ .. మైనంపల్లి హనుమంతరావు మంగళవారం మరోసారి స్పందించారు. తనను ముఖ్యమంత్రి ఏమీ అనలేదని.. తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. అది తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. 

హైదరాబాద్ : సోమవారం నాడు అధికార టిఆర్ఎస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పటి నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. తనకు, తన కుమారుడికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఆయన మరొకసారి టికెట్ల కేటాయింపుపై స్పందించారు. 

నిన్న తాను మాట్లాడింది పార్టీ గురించి కాదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలని ఆయన అన్నారు. మంగళవారం నాడు మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై మరోసారి స్పందించారు.

ఎల్‌బీనగర్ లో గిరిజన మహిళపై దాడి: సీసీటీవీ పుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశం

నిన్న తాను పార్టీ గురించి మాట్లాడలేదన్నారు. కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వెల్లడించానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాతే తన కార్యాచరణను వెల్లడిస్తానని మైనంపల్లి హనుమంతరావు తేల్చారు. హరీష్ రావుపై నా వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం. ఇప్పటివరకు ఏ పార్టీనీ సంప్రదించలేదు. నేను క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తా.. ముఖ్యమంత్రి నన్నేం అనలేదు. నేనెందుకు పార్టీని అంటాను అన్నారు.

హనుమంతరావు మాట్లాడుతూ.. ‘నేను జీవితంలో ఇప్పటివరకు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నాకు నా కొడుకే ముఖ్యం. మెదక్, మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ముఖ్యం. నన్ను ఇబ్బంది పెడితే నేను కూడా తిరిగి కచ్చితంగా బదులిస్తాను. నేను పార్టీలకు అతీతంగా ఉంటాను ఏ పార్టీనీ విమర్శించను. మా అబ్బాయికి టికెట్ ఇస్తే గెలిపించుకొస్తా’’ అని అన్నారు.

తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్, తనకు మల్కాజిగిరి టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని ఆయన అన్న విషయం తెలిసిందే. ఒకవేళ అలా ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్రంగానే బరిలోకి దిగుతానంటూ సోమవారం ఆయన అన్న మాటలు సంచలనంగా మారాయి. దీంతోపాటు మెదక్ లో మంత్రి హరీష్ రావు పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.

కరోనా సమయంలో తన కొడుకు మైనంపల్లి రోహిత్ ప్రాణాలకు లెక్కచేయకుండా ప్రజాసేవ చేశారని చెప్పుకొచ్చారు. తనతో పాటు తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోతే.. అవసరమైతే హరీష్ పై కూడా పోటీ చేస్తానని అన్నారు. సోమవారం తొలివిడత బీఆర్ఎస్ జాబితాలో మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఖరారు అయ్యింది. మెదక్ టికెట్ ను మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి కి కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. 

దీంతో మైనంపల్లి హనుమంతరావు కినుక వహించారు. హరీష్ రావుపై ఇలా మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించడంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు మరోసారి మైనంపల్లి హనుమంతరావు ఈ విధంగా స్పందించారు.