మోసం చేసి గెలవలేదు.. ఎంపీ కవిత
ఓడిపోయిన ఏ పార్టీ నేతలైనా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించడం సహజమే. కానీ అది అబద్దం. మేము ఎలాంటి ట్యాంపరింగ్ కి పాల్పడలేదు.
ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. తాము మోసం చేసి గెలవలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ఈరోజు మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ ఆధిక్య దిశలో దూసుకుపోతోంది. దీంతో.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ.. కాంగ్రెస్ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు.
ఈ కామెంట్లపై ఎంపీ కవిత స్పందించారు. ‘‘ ఓడిపోయిన ఏ పార్టీ నేతలైనా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించడం సహజమే. కానీ అది అబద్దం. మేము ఎలాంటి ట్యాంపరింగ్ కి పాల్పడలేదు. అసలు ట్యాంపరింగ్ కి ఛాన్స్ లేదని సీఈసీ.. నిన్న ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రజలే టీఆర్ఎస్ పార్టీని దగ్గరుండి మరీ గెలిపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలన్నీ అబద్దాలు’’ అని కవిత పేర్కొన్నారు.
‘కాంగ్రెస్, ఇతర పార్టీల్లాగా టీఆర్ఎస్ ఎలాంటి మోసానికి పాల్పడలేదు. గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చూసే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారన్న నమ్మకం ఉంది. మాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేశాం. అందుకు బదులుగా ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. అది కూడా ఏకగ్రీవంగానే. ఈ విషయంలో మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మాపై, మా పాలనపై ఇతర పార్టీలు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేవు’ అని వెల్లడించారు కవిత.