దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య: మోత్కుపల్లి నర్సింహులు
దళితబంధు పథకం అమలు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద తాను ఆత్మహత్య చేసుకొంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. దళితబంధు పథకంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకొన్నారని ఆయన కొనియాడారు.
హైదరాబాద్: దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య చేసుకొంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారుదళిత బంధు పథకంపై రేవంత్ రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ మోత్కుపల్లి నర్సింహులు ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షకు దిగారు. దళిత జాతికి మోక్షం కల్గించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.
అంబేద్కర్ ఆశయ సాధన కోసం కేసీఆర్ మహోన్నత నిర్ణయం తీసుకొన్నారన్నారు. దేశంలో దళితుల కోసం నామమాత్రం స్కీమ్ లు పెట్టారన్నారు.వ్యవస్థలో హెచ్చు తగ్గులు పోవాలంటే ఆర్ధిక స్వావలంభన కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ దళితులకు దళితబంధును వందశాతం అమలు చేస్తారన్నారు.
దళితబంధు పథకాన్ని మోత్కుపల్లి నర్సింహులు తొలి నుండి ప్రశంసిస్తున్నారు. దళితుల కోసం ఎవరూ కూడా చేయని విధంగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. దళితబంధు కార్యక్రమాన్ని వ్యతిరేకించిన పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు.ఇటీవలనే మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి నర్సింహులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరుకావద్దని బీజేపీ నిర్ణయం తీసుకొంది.
ఆ సమయంలో బీజేపీలో ఉన్న నర్సింహులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు నర్సింహులుపై విమర్శలు చేశారు. ఈ సమావేశానికి హాజరై తాను బీజేపీకి నష్టం జరగకుండా చేశానని నర్సింహులు చెప్పారు. ఆ తర్వాతే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.