కేవలం నీటి కోసం... చిన్నమ్మ, చెల్లిని గొడ్డలితో నరికిచంపిన కిరాతకుడు
క్షణికావేశంలో చిన్నమ్మ, చెల్లిని పొలం వద్దే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు దుండగుడు. ఈ దుర్ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సిద్దిపేట: కేవలం వ్యవసాయ పొలం వద్ద నీటి పంపకం విషయంతో తలెత్తిన వివాదం ఇద్దరు తల్లీ, కూతురు ప్రాణాలను బలితీసుకుంది. క్షణికావేశంలో చిన్నమ్మ, చెల్లిని పొలం వద్దే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు దుండగుడు. ఈ దుర్ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ దారుణానికి సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెంది గుగ్గిళ్ల కనకయ్య, రాజయ్య అన్నదమ్ముళ్లు. వీరికి తండ్రి నుండి చెరో మూడెకరాల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చింది. అయితే వ్యవసాయ బావి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు మధ్య వివాదం నెలకొంది. నీటి వాడకం విషయంలో ఇరు కుటుంబాలను గొడవలు జరిగేవి.
read more అక్రమ సంబంధం.. మహిళ దూరం పెట్టిందని..
కొన్నేళ్ల క్రితం కనకయ్య చనిపోగా అతడి భార్య వ్యవసాయం చేస్తోంది. ఈ క్రమంలోనే రోజూ మాదిరిగానే బుధవారం కూడా పొలానికి కూతురిని తీసుకుని వెళ్లింది. అయితే రాజయ్య కొడుకు శ్రీనివాస్ మరోసారి వ్యవసాయ బావి విషయంలో వీరితో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగడంతో శ్రీనివాస్ కోపంతో ఊగిపోతూ తల్లీ కూతురుపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.