మహిళా రెజ్లర్లకు మద్దతు.. బ్రిజ్ భూషణ్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ఎమ్మెల్సీ కవిత..
దేశంలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్: దేశంలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళనలు తెలుపుతున్న కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పోస్టు చేశారు.
మన మహిళా రెజ్లర్ల కృషి, అంకితభావం, దేశభక్తి భారతదేశం రెజ్లింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ 5 రోజుల్లో దేశ ప్రయోజనాల కోసం ఆలోచించాలని కోరారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగం తర్వాత కూడా నిందితుడు బహిరంగంగా బయట ఉన్నాడుని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని అన్నారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఖండించాల్సిదేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దేశం మొత్తం సమాధానం కోరుకుంటోందని.. ప్రపంచం చూస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమకు, దేశానికి కీర్తి తెచ్చి పెట్టిన పతకాలను గంగలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. ఇందుకోసం వారు మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని హరికీ పౌరీ ఘాట్కు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని రైతు నేత నరేశ్ టికాయిత్ అడ్డుకున్నారు. దీంతో వారు గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేయాలనే ప్రణాళికను తాత్కాలికంగా విరమించుకున్నారు. బ్రిజ్ భూషణ్పై చర్యల తీసుకునేందుకు ఐదు రోజుల గడువు ఇచ్చారు.