బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అసలు బీజేపీలో చోటులేదని ఆయన అన్నారు. ఈటల రాకను వ్యతిరేకిస్తే.. వారికే నష్టమని ఆయన అన్నారు.


మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలో బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన బీజేపీలో చేరడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈటలను వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అసలు బీజేపీలో చోటులేదని ఆయన అన్నారు. ఈటల రాకను వ్యతిరేకిస్తే.. వారికే నష్టమని ఆయన అన్నారు. ఈటల వస్తే చాలా మంది టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఎవర్ని చేర్చుకోవాలో జాతీయ నాయకత్వానికి తెలుసని, ఈటల వస్తే బయటకు వెళ్తామనటం సరైంది కాదని సూచించారు. బీజేపీ తాత, తండ్రుల పార్టీ కాదని గుర్తుంచుకోవాలని రాజాసింగ్‌ తెలిపారు.

బీజేపీలో చేరేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా ఆయన రాష్ట్ర, జాతీయ నేతలతో మంతనాలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఈటల ఢిల్లీలో బీజేపీ నేత నడ్డాతో భేటీ కూడా అయ్యారు. అయితే ఈటల రాకను బీజేపీలో కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈటల రాకపై ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని పలువురు నేతలు ఉలిక్కిపడుతున్నారు.

 ఈటల రాజేందర్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని కూడా హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. దాదాపుగా ఈటల బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పెద్దిరెడ్డిని మెత్తపరిచేందుకే డీకే అరుణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.