సత్తుపల్లి కార్యకర్తల భేటీలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లాలో సీట్లు గెలవడం ఒక ఎత్తు... సత్తుపల్లిలో గెలవడం ఒక ఎత్తు అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సీట్లు గెలవడం ఒక ఎత్తు... సత్తుపల్లిలో గెలవడం ఒక ఎత్తు అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకొంటే వచ్చే కేబినెట్లో తాను ఉండకపోవచ్చని తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు.
శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని తుమ్మల నాగేశ్వర్ రావు కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలవడం ఒక ఎత్తైతే... సత్తుపల్లి సీటు గెలవడం మరో ఎత్తన్నారు. ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు.
సత్తుపల్లి సీటు గెలవడం ఎంత అవసరంగా చెబుతున్నానో అర్థం చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ కార్యకర్తలను కోరారు. తాను అవకాశాల కోసం రాజకీయాలు చేయలేదని తుమ్మల చెప్పారు.