ప్రయాణీకుల నుంచి పైసా ఎక్కువ తీసుకున్నా కఠినచర్యలు: మంత్రి పువ్వాడ
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరుగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడారు. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తింపుతున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్గా నియమిస్తున్నట్లు చెప్పారు.
బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు.
అదే విధంగా ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో... షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు.
ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామన్నారు. ఇక ఆర్టీసీ బస్సులన్నింటా బస్పాస్లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్పాసులన్నీ అనుమతించాలని, బస్పాస్లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు.