తెలంగాణలో పచ్చదనం 23.4శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు.
మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన హరితహారం ప్రాధాన్యత గురించి వివరించారు. కరోనా సెకండ్ వేవ్ తో దేశం మొత్తం తల్లడిల్లిపోయిందని ఆయన అన్నారు. ఆక్సీజన్ అందక.. సరిపడ ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందని ఆయన అన్నారు.
హరితహారాన్ని మించిన ఉదాత్త, గొప్ప కార్యక్రమం మరోటి లేదని ఆయన అన్నారు. భవిష్యత్తు కోసం పుడమిని కాపాడుకునేందుకు అందరమూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రూ.5900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మానవ ప్రయత్నం కొనసాగుతోందన్నారు.
తెలంగాణలో పచ్చదనం 23.4శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకోసం 109 అర్బన్ ఫారెస్ట పార్క్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో 650కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారాయన్నారు.
పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన తోడు ఉండేది చెట్టేనని ఆయన పేర్కొన్నారు. 85శాతం మొక్కలు బతకపోతే స్థానిక ప్రజా ప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టారన్నారు. మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం అన్న సోయి అందరికీ రావాలన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న కేసీఆర్ కల నెరవేరి దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు.అర్బన్ ఫారెస్ట్ పార్కుల స్పూర్తితో కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన అటవీశాఖకు అభినందనలు తెలిపారు.
ఇదే కార్యక్రమంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... హరితహారంతో భారతదేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.15 వేలకు పైగా నర్సరీలు దేశంలో తెలంగాణ తప్ప ఎక్కడా లేవన్నారు. భావి తరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు... చెట్లు నాటి సంరక్షించాలన్నారు.అడవులను బాగా సంరక్షించుకోవాలని చెప్పారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.
