గజ్వేల్ కు ఫారెస్ట్ యూనివర్శిటీ రాకుండా అడ్డుపడ్డారు: తమిళిసైపై హరీష్ రావు ఫైర్
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గజ్వేల్ కు ఫారెస్ట్ యూనివర్శిటీ రాకుండా అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు.
![Minister Harish Rao Serious Comments On Telangana Governor Tamilisai Soundararajan lns Minister Harish Rao Serious Comments On Telangana Governor Tamilisai Soundararajan lns](https://static-ai.asianetnews.com/images/01gyw177rx8asr5t7jn63kz4ty/harish-rao-1-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: గజ్వేల్ కు ఫారెస్ట్ యూనిర్శిటీ రాకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధుల సభను మంగళవారంనాడు నిర్వహించారు. ఈ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృధి కి అడ్డుపడుతున్న గవర్నర్ ని తాను తెలంగాణ బిడ్డగా గట్టిగా ప్రశ్నిస్తున్నానని హరీష్ రావు చెప్పారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని తెలంగాణా అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందన్నారు. గులాబీ సైనికుడుగా ఉద్యమకారుడుగా తనకు మాట్లాడే హక్కుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. అభివృద్ధి అంటే దేశానికి సంపద రావాలన్నారు. బయట దేశాల్లో ఉన్నవారు తిరిగి మన దేశానికి రావాలని సీఎం కోరారు. బిజెపి పోకడల వల్ల దేశంలో ఉన్న సంపద బయిట దేశాలకు తరలి పోతోందని హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా దేశంలో ఉన్న పౌరులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని మంత్రి చెప్పారు.
తెలంగాణ సాధించి చరిత్ర తిరగరాసిన నాయకుడు మన కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు. గజ్వేల్ ప్రాంతంలో కరువు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు చిత్రీకరించేందుకు పక్క రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చేవారన్నారు. ప్రస్తుతం గజ్వేల్ లో జరుగుతున్న అభివృద్ధి చిత్రీకరించడానికి దేశ విదేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. ఎయిర్ పోర్టులో విమానాలు దిగే రన్ వే లాంటి రింగురోడ్డును గజ్వేల్ కు తెచ్చినందుకు కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండుసార్లు గెలిపించిన గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకునేందుకే గజ్వేల్ ను కేసీఆర్ అభివృద్ది చేస్తున్నారని హరీష్ రావు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని హరీష్ రావు చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం , కేంద్రం చేసిన కార్యక్రమాలపై గ్రామాల్లో చర్చలు ప్రారంభించాలని హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.
also read:బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్: హరీష్ రావు
తెలంగాణ రాకపోతే నూతన జిల్లాలు, నూతన మండలాలు, నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యేవా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఎలా సాధ్యమయ్యాయనే విషయమై చర్చ పెట్టాలని హరీష్ రావు కోరారు