కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా రాహుల్ తెలంగాణ పర్యటనపై సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా రాహుల్ తెలంగాణ పర్యటనపై సెటైర్లు వేశారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతులే కాంగ్రెస్ను ఈడ్చి తన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని.. చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని హరీష్ రావు ప్రశ్నించారు. వరంగల్లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని తెలంగాణ ప్రజానీకం భావిస్తుందన్నారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో పోస్టు చేశారు.
తెలంగాణ రైతుల పట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని ఎద్దేవా చేశారు. ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.
ఇక, ఉమ్మడి వరంగల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కూడా.. రాహుల్ తెలంగాణ పర్యటనపై సైటెర్లు వేశారు. పొలిటికల్ టూరిస్ట్లు రోజుకోకరు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్న ఒకరు మహబూబ్ నగర్కు వచ్చారని.. నిన్న ఒకరు వరంగల్కు వచ్చారని చెప్పారు. నిన్న వరంగల్ కొచ్చిన వ్యక్తి కాంగ్రెస్ వాళ్లు రాసింది.. చదివి వెళ్లారని విమర్శించారు. ఆయనకు వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు అని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. మెరుగైన పరిస్థితి లేదు కాబట్టే.. అవార్డులు రావడం లేదన్నారు. ఎవరెవరో వస్తారు.. మాట్లాడతారు.. హైదరాబాద్కు వచ్చి ధమ్ బిర్యానీ తిని పోతారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్టుగా విమర్శలు చేసి.. డైలాగులు కొడతారని.. కానీ వాళ్లతోనే అయ్యేది లేదు పోయేది లేదని విమర్శించారు. వాళ్ల గురించి నెత్తి కరాబు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
