ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేసారు. 

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు మంత్రులు, బిఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం అవినీతీకి పాల్పడుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీని తమ అవినీతితో స్కాంగ్రెస్ గా మార్చిన గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ అవినీతి అంటూ మాట్లాడటం విడ్డూరంగా వుందని హరీష్ రావు అన్నారు. 

''రాహుల్ గాంధీ గారు... దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది.అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టింది'' అంటూ రాహుల్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు హరీష్. 

''బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు... మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది'' అంటూ హరీష్ ట్వీట్ చేసారు. 

''రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ'' అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. 

Read More కాళేశ్వరంపై కాగ్ నివేదికపై చర్చకు రావాలి: కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ రెడ్డి సవాల్

''కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని... కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా? స్కీముల్లో స్కాం చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే'' అంటూ హరీష్ ఎద్దేవా చేసారు.

''అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు... రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..'' అంటూ హరీష్ రావు ట్విట్టర్ వేదికన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.