సారాంశం

Minister Harish Rao: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు వివిధ అభివృద్ధి కార్యక్రమాలాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలల్లో పాల్గొన్నారు.   

Minister Harish Rao:  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అధికార పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నా.. తాను ప్రజలకు  చేరువ కాలేకపోతున్నానని, వారికి మేలు చేయలేక పోతున్నానని వాపోయారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని స్పష్టం చేశారు.

ఈ తరుణంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిపై మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆదివారం నాడు మంత్రి హరీష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కల్వకుర్తి టిక్కెట్ ఇవ్వనందుకు పార్టీ మారడం సరికాదని అన్నారు. నమ్మి రెండు సార్లు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తల్లి పాలు తాగి.. రొమ్ము గుద్దే రకమని హరీష్‌ రావు
తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ.. రైతు బంధు, రైతు బీమా వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి కుట్రలు చేసినా.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు కనీస వసతులు కూడా ఉండేవి కావనీ, కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 200 వందలు ఉన్న పెన్షన్ 2000 చేశారని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని హరీష్‌ రావు వెల్లడించారు.