అవి ఎండమావులు.. అటు వెళితే ఏం రాదు: కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ ఫైర్
70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తాగునీటి సమస్య కూడా తీర్చలేదని ఫైరయ్యారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తాగునీటి సమస్య కూడా తీర్చలేదని ఫైరయ్యారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కరెంట్ ఇవ్వక ఇబ్బంది పెట్టిందని... ఇప్పుడు బీజేపీ మీటర్లు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాతనే.. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని హరీశ్ రావు గుర్తుచేశారు.
వానాకాలంలో ఉసిల్లు వచ్చినట్లు.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చిపోతారు అని మంత్రి విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎండమావులు వంటివే.. వాటి వెంటపోతే ఏమీ రాదు అని హరీష్ రావు సెటైర్లు వేశారు.