హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘‘సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహిస్తోందని హరీశ్ ప్రశంసించారు. సీఎం సహకారంతో నుమాయిష్ను విశ్వవ్యాప్తం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దాం అని హరీశ్రావు తెలిపారు.
ALso Read:నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజీనామా.. కేటీఆర్కే ఆ పోస్ట్, ఫిక్స్!
భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. 81 ఏళ్ల హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో పదవీకాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటల స్థానంలో మంత్రి కేటీఆర్ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సభ్యులు అప్పట్లో తీర్మానం చేశారు. అయితే అనూహ్యంగా మంత్రి హరీశ్ రావు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం విశేషం.
