ఈటల హత్యకు కుట్ర... నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా...: మంత్రి గంగుల సవాల్ (వీడియో)
తన హత్యకు కుట్ర జరిగిందంటూ నిన్న(సోమవారం) మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవన్నారు.
కరీంనగర్: తనను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈటెలపై హత్యకి కుట్ర జరిగిందన్న వ్యాఖ్యలని గంగుల ఖండించారు. రాజకీయాల్లో హత్యలు వుండవని కేవలం ఆత్మహత్యలే వుంటాయని మంత్రి పేర్కొన్నారు.
''ఈటెల రాజేందర్ నాకు సోదరుడి లాంటివాడు.ఆయనతో నాకు గట్టు పంచాయతీ లేదు... కేవలం రాజకీయ పంచాయితీ మాత్రమే ఉంది. ఈటల హత్యకు కుట్ర జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా'' అని గంగుల సవాల్ విసిరారు.
వీడియో
''ఈటలకి చెప్పిన మాజీ నక్సలైటుని విచారించాలి. ఈటల తన మనుషుల చేతే దాడి చేయించుకుని సానుభూతి పొందాలని చూస్తున్నాడు. తన హత్యకు కుట్ర అంటూ ఈటల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి, సిపి కమలాసన్ రెడ్డిని కోరుతున్నా'' అన్నారు.
read more ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా: గంగుల కమలాకర్ కౌంటర్
''నాపై ఎలాంటి నేర చరిత్ర లేదు. కుట్ర చేసింది ఏ మంత్రో చెప్పాలి. ఇకపై రోజూ నిన్ను అడుగుతునే ఉంటా ఆ కుట్ర చేసింది ఎవరని. సానుభూతితో ఓట్లు పొందేందుకు ఈటల దిగజారి ఈ వ్యాఖ్యలు చేసారు. దోషి అయినా దొరకాలి లేదా ఈటెల రాజేందర్ తన తప్పుడు వ్యాఖ్యలు అని ఒప్పుకోవాలి. అంతవరకు నేను ఈటలను ప్రశ్నిస్తూనే వుంటా'' అని స్పష్టం చేశారు.
''హుజురాబాద్ అంటే కేసిఆర్ ప్రేమ ఎక్కువ కాబట్టే దళిత బంధు ని హుజురాబాద్ కేంద్రంగా ప్రారంభిస్తున్నారు. ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రణాళిక జరిగింది. ఎన్నికలకి, దళిత బంధు పథకానికి ఎలాంటి సంబంధం లేదు'' అని మంత్రి గంగుల స్పష్టం చేశారు.