తండ్రిని చంపిన వ్యక్తిపై పగ.. 50వేట కొడవళ్లతో దాడి..!
తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకునేందుకు అసద్ తన కుమార్తెను స్నేహితుడి కుమారుడికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించారు. తర్వాత కొంతకాలానికి కూతురు, అల్లుడు మధ్య విభేదాలు వచ్చాయి.
తండ్రిని చంపిన వ్యక్తిపై కొడుకులు పగ తీర్చుకున్నాడు. తమ తండ్రి చనిపోయిన దాదాపు మూడేళ్ల తర్వాత వేట కొడవళ్లతో దాడి చేశారు. పట్ట పగలే అతి దారుణంగా నరికి చంపేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ సమీపలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... ఎంఐఎం నాయకుడు అసద్ ఖాన్(45), అంజాద్ ఖాన్ మిత్రులు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకునేందుకు అసద్ తన కుమార్తెను స్నేహితుడి కుమారుడికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించారు. తర్వాత కొంతకాలానికి కూతురు, అల్లుడు మధ్య విభేదాలు వచ్చాయి.
తమ కూతురు, అల్లుడు విడిపోవడానికి స్నేహితుడే కారణమని అంజాద్ పై అసద్ పగ పెంచుకున్నాడు. 2018లో శాస్ట్రిపురంలోని వెల్డింగ్ షాప్ లో ఒంటరిగా ఉన్న అంజాద్ ఖాన్ పై మరో ఐదుగురితో కలిసి దాడి చేశాడు. సుత్తితో కొట్టి మరీ హత్య చేశాడు. ఈ ఘటనలో అరెస్టు అయ్యి.. జైలుకి కూడా వెళ్లాడు. కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి బయటక వచ్చాడు. కాగా.. తమ తండ్రిని చంపిన అసద్ ని చంపేయాలని.. అంజాద్ కొడుకులు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం అసద్ ఖాన్ పై దాడి చేశారు. అసద్ వెళుతున్న బైక్ ని ఆటోతో ఢీ కొట్టారు. తర్వాత ఆటోలో నుంచి ఆరుగురు వేట కొడవళ్లతో కిందకు దిగారు. బైక్ పై నుంచి కింద పడిన అసద్ ఖాన్ ని వేట కొడవళ్లతో దాడి చేసి.. అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై 50 కి పైగా కత్తిగాట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.