ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో ఠాగూర్ భేటీ: నిరుద్యోగ సమస్యపై రేవంత్ పాదయాత్ర?
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టిపెట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు, పార్టీ ముఖ్యులతో మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు.
హైదరాబాద్: కొత్త పీసీసీ కమిటీతో, సీఎల్పీ, కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ గురువారం నాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
రేవంత్ సహా పార్టీ ప్రకటించిన కమిటీ చైర్మెన్లు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పలువురు పార్టీ ముఖ్యులతో మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో కూడ ఠాగూర్ ఇవాళ సమావేశంకానున్నారు.
నిరుద్యోగ సమస్యపై ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నిరుద్యోగ సమస్యపై పాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ నుండి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది.ఈ విషయాలపై పార్టీ ముఖ్య నేతలు చర్చిస్తున్నారు.