హైదరాబాద్లో మరో దారుణం: తిరుమలగిరిలో భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు
తిరుమలగిరిలో దారుణం జరిగింది. భార్యను, అత్తను అతి కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి. కుటుంబంలో ఈ రోజు చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి హతమార్చాడు
ఇప్పటికే సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య, నిందితుడి ఆత్మహత్య వ్యవహారాలతో తెలుగు రాష్ట్రాలతో పెద్ద చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. భార్యను, అత్తను అతి కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే... తిరుమలగిరి ఆర్మీ హాస్పిటల్లో పని చేస్తున్న నాగ పుష్పతో అదే ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న చిన్న బాబుతో వివాహం జరిగింది. దీంతో భార్యాభర్తలిద్దరూ తిరుమలగిరి ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు.
కాగా, కుటుంబంలో ఈ రోజు చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నగరంలో జరుగుతున్న వరుస దారుణాలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.