కొడుకును బావిలో పడేసి... తండ్రి ఆత్మహత్య..!
ఆ తర్వాత కొడుక్కి.. తినుబండారాలు కొనిపెట్టి.. వాటితో సహా వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న బావిలోకి తన కుమారుడిని పడేసి.. ఆ తర్వాత.. కొంత దూరంలో ఉన్న ఓ చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి కన్న కొడుకును అతి దారుణంగా చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఏనుబాములలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏనుబాముల గ్రామానికి చెందిన సురుకంటి రాంరెడ్డి(45), పద్మ దంపతులకు ప్రేమ్ చరణ్ రెడ్డి, తనూజ్ రెడ్డి(6) ఇద్దరు కొడుకులు ఉన్నారు. గురువారం రాంరెడ్డి తన చిన్న కుమారుడు తనూజ్ రెడ్డిని బయటకు తీసుకువెళ్తానని చెప్పి బైక్ పై తీసుకువెళ్లాడు.
ఆ తర్వాత కొడుక్కి.. తినుబండారాలు కొనిపెట్టి.. వాటితో సహా వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న బావిలోకి తన కుమారుడిని పడేసి.. ఆ తర్వాత.. కొంత దూరంలో ఉన్న ఓ చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే రాం రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
వారు వచ్చి బాలుడి కోసం వెతకగా.. బావిలో చెప్పులు తేలుతూ కనిపించాయి. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి బావిలో నుంచి పిల్లాడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. ఎలాంటి ఆచూకీ లభించకపోవడం గమనార్హం.
రాంరెడ్డి కుటుంబంలో ఏడాదిగా కుటుంబ కలహాలు జరుగుతుండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, గత లాక్డౌన్ నుంచి రాంరెడ్డి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేయడం, ఈ క్రమంలో తోచిన వారికి సాయం అందిస్తూ రూ.లక్షల అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కుటుంబసభ్యులతో రాంరెడ్డికి ఇంట్లో గొడవలు ఏడాదిగా జరుగుతున్నాయి. ఇతని వ్యవహారం చూసిన కుటుంబ సభ్యులు చివరకు హైదరాబాద్లోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం కొంత భూమిని అమ్మి రాంరెడ్డి అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఇలా కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.