Women Reservation Bill: జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసికట్టుగా నిలవాలని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
Women Reservation Bill: మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టిన వెంటనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై దాదాపు అన్ని పార్టీలు సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నాయి. కొన్ని పార్టీలు మహిళ రిజర్వేషన్ బిల్లుపై పలు సూచనలు చేస్తున్నాయి. ఈ బిల్లుపై లోక్ సభలో రేపటినుండి చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పందించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఓ భారతీయుడిగా తాను గర్విస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దీనికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలతో సహా ఈ మైలురాయి చట్టంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని BRS పార్టీ మహిళా సాధికారత దిశగా ఎన్నో చర్యలు తీసుకుందని అన్నారు. చాలా ఏళ్ల క్రితమే జిల్లా పరిషత్లు, మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు సహా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి.. పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచామని, గతంలోనూ అనేక ప్రగతిశీల చర్యలు చేపట్టిందని ఆయన సూచించారు .