Asianet News TeluguAsianet News Telugu

కొండపోచమ్మ సాగర్‌కు నీటి తరలింపుకు లిప్ట్‌లు సిద్దం చేయాలి: కేసీఆర్

 కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ప్రస్తుతం రంగనాయక సాగర్ వరకు  నీళ్లు వస్తున్నాయని, ఆ నీటిని ఈ వర్షాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

kondapochamma sagar:CM KCR orders to Transco cmd prabhakar rao to set lifts within four days
Author
Hyderabad, First Published Apr 23, 2020, 4:34 PM IST


హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ప్రస్తుతం రంగనాయక సాగర్ వరకు  నీళ్లు వస్తున్నాయని, ఆ నీటిని ఈ వర్షాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కారం, మర్కూక్ పంపుహౌజ్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.  కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై సిఎం ఆరాతీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని  ఈ వానాకాలంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు తరలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. 

రంగనాయక్ సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని  అక్కారం, మర్కూక్ పంపుహౌజుల పనులను ప్రభాకర్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగుకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. 

ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు, తర్వాత కొండ పోచమ్మ సాగర్ కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని సీఎండి చెప్పారు.

 అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం (6x27) కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం (6x34) కలిగిన పంపులు సిద్దమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని  అని సీఎండి ప్రభాకర్ రావు తెలిపారు.

సిఎండి ప్రభాకర్ రావు వెంట ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాస రావు, డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, ఇడి పివి ప్రభాకర్ రావు, ఎస్.ఇ. ఆంజనేయులు, ఎస్.ఇ.  వేణు తదితరులున్నారు. 

ప్రత్యేక అనుమతులతో ముంబాయి నుంచి నిపుణుల బృందం రాక

పంపుహౌజుల కేబుల్ పనులు చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్ కు చెందిన నిపుణుల బృందం లాక్ డౌన్ కారణంగా ముంబాయిలో చిక్కుకుంది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేదు. దీంతో ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. డిజిపి మహారాష్ట్ర డిజిపికి లేఖ రాసి, ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం ఈ నెల 21న సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్ పనులు నడుస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios