సత్యం రామలింగ రాజు కుమారుడి చేతిలో తెలంగాణ పాలన: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద కాంగ్రెసు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలన కేటీఆర్ మిత్రుడు తేజ రాజు చేతిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ పాలన ప్రస్తుతం మంత్రి కెటీ రామారావు మిత్రుడు తేజ రాజు చేతిలో ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలులో ఉన్న సత్యం రామలింగ రాజు కుమారుడే తేజ రాజు అని ఆయన అన్నారు
కాంగ్రెసుకు పేరు వస్తుందనే భయంతోనే నల్లగొండ జిల్లాలో తమ హయాంలో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ టన్నెల్, ఇతర ప్రాజెక్టుల పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో తాను సర్వే చేయించానని, 67 శాతం ఈటల రాజేందర్ కు, 30 శాతం టీఆర్ఎస్ కు ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు ఐదు శాతం లోపే ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. హుజూరాబాద్ అభ్యర్థిని తమ కాంగ్రెసు పార్టీ ప్రకటించి, ప్రచారం చేస్తే మార్పు వస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెసు జాగ్రత్త పడాల్సి ఉందని ఆయన చెప్పారు. నల్లగొండ, భువనగరి లోకసభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.