Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ను కలిసినప్పుడే అనుమానాలు, బహిష్కరిస్తాం: కౌశిక్ రెడ్డిపై కోదండరెడ్డి

కేటీఆర్ ను కలిసినప్పుడే కౌశిక్ రెడ్డిపై అనుమానాలు వచ్చాయని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. అప్పట్లో హెచ్చరించినా కూడా కౌశిక్ రెడ్డి తీరులో మార్పు రాలేదని ఆయన అన్నారు.

Kodanda reddy warns Congress Huzurabad leader Koushik Reddy
Author
hyderabad, First Published Jul 12, 2021, 1:37 PM IST

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీ రామారావును కలిసినప్పుడే తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై అనుమానాలు వచ్చాయని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి 24 గంటల లోపల సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు. సరైన వివరణ ఇవ్వకపోతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు 

కాంగ్రెసుకు నష్టం వచ్చే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ ను కలిసిప్పుడే తాము హెచ్చరించామని, అయితే హెచ్చరికలు జారీ చేసిన కౌశిక్ రెడ్డిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘానికి సూచించింది. టీపీసీసీ మార్గదర్శకాల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

కాగా, పార్టీ  క్రమశిక్షణ సంఘం నోటీసులు అందుకున్న హుజూరాబాద్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదిలావుంటే, తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి చెప్పిన మాటల ఆడియో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ పీసీసీ నోటీసులు ఇచ్చింది. వచ్చే 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని పీసీసీ ఆయనను ఆేదశించింది. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డిని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించింది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కౌశిక్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దాంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. బిజెపి తరఫున ఆయన హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 

ఇప్పటి వరకు టీఆర్ఎస్ తన హుజూరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ పార్టీ నాయకత్వం అభ్యర్థి వేటలో ఉంది. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన గతంలో కాంగ్రెసు తరఫున ఈటల రాజేందర్ మీద పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహిత బంధువు. 

Follow Us:
Download App:
  • android
  • ios