దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలకలం: భద్రత కట్టుదిట్టం, ఎలా వచ్చింది?
మాజీ కేంద్ర దత్తాత్రేయ ఇంట్లో కత్తి దొరికింది. ఎవరు ఈ కత్తిని తీసుకొచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్:హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసంలో ఓ కత్తి కలకలం రేపింది. గవర్నర్ గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు పలువురు ఆయన ఇంటికి వస్తున్నారు.ఈ సమయంలో ఈ కత్తిని బీజేపీ కార్యకర్తలు గుర్తించి భద్రతా సిబ్బందికి అప్పగించారు.
బుధవారం నాడు ఫిజియోథెరపీ ముగించుకొని దత్తాత్రేయ హాల్లోకి వచ్చిన వెంటనే ఆయనను కలుసుకొనేందుకు పలువురు తోసుకొంటూ ముందుకు వచ్చారు. ఈ సమయంలోనే ఓ కత్తి కిందపడింది. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు దత్తాత్రేయ భద్రతా సిబ్బందికి ఈ కత్తిని అందించారు.
దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించినందుకు ఆయనను అభినందించేందుకు పలువురు ప్రతి రోజూ ఆయన ఇంటికి వస్తున్నారు. ఈ ఘటనతో దత్తాత్రేయ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ కత్తి ఎలా వచ్చింది, ఎవరు కత్తితో లోపలికి ప్రవేశించారు. కత్తితో ఎందుకు ప్రవేశించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కత్తిని తెచ్చారా లేక పొరపాటున కత్తితో వచ్చారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ నెల 1వ తేదీన హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.