కల్వకుంట్ల కవితపై సినీ నటి ఖుష్పూ సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై సినీ నటి, కాంగ్రెసు నేత ఖుష్బూ సెటైర్లు వేశారు. కేసిఆర్ మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం సిగ్గు చేటు అని ఆమె అన్నారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై సినీ నటి, కాంగ్రెసు నేత ఖుష్బూ సెటైర్లు వేశారు. కేసిఆర్ మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం సిగ్గు చేటు అని ఆమె అన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం కేసీఆర్ కుటుంబంపై విమర్శల జడివాన కురిపించారు. తెలంగాణలో కేవలం కవితకు మాత్రమే మేలు జరిగిందని విమర్శించారు. బతుకమ్మ చీరల్లో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని అన్నారు. కేసీఆర్ది రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని అన్నారు.
టీఆర్ఎస్ నాలుగేళ్లలో అవినీతి, అక్రమాలే చేసింది తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని ఖుష్బూ అన్నారు.టీఆర్ఎస్ వస్తే ఒక మంచి పని ఐనా జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. తెలంగాణలో కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని,
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజల్లోకి రాలేదని అన్నారు. కనీసం సెక్రటేరియట్కు కూడా కేసీఆర్ వెళ్లిన దాఖలాలు లేవని ఖుష్బూ అన్నారు
మహిళల కోసం ఏదైనా చేశారా అంటే కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రమే మేలు చేశారని విమర్శించారు. తెలంగాణలో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. మావోయిస్టు సభ్యురాలు శృతిని లైంగికంగా హింసించి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆమె ఛాతీపై, కాళ్లపై చిత్రహింసలకు గురి చేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు.
36 లక్షల మంది రైతులకు ఇంకా పాసు బుక్కులే అందలేదని తెలిపారు. గతంలో రేషన్ కార్డులపై ఇచ్చిన 9 రకాల సరుకులను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ వాటిని ఇస్తామని చెప్పారు.