వాసాలమర్రిలో కేసీఆర్ టూర్: దళిత కాలనీలో పర్యటన
దత్తత తీసుకొన్న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ బుధవారంనాడు పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ఆయన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు.
నల్గొండ: దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు పర్యటించారు.వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్నారు. గతంలో ఈ గ్రామానికి వచ్చిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు ఈ మేరకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గ్రామానికి ప్రత్యేకాధికారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ను నియమించారు సీఎం. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై ఈ కమిటీ సభ్యులు చేసిన సూచనల మేరకు అధికారులు నిర్ణయం తీసుకొంటారు.ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చేరుకొన్నారు. గ్రామానికి చేరుకొన్నవెంటనే ఆయన దళితవాడలో పర్యటించారు.
రైతు వేదిక భవనంలో గ్రామాభివృద్ది కోసం ఏర్పాటు చేసుకొన్న కమిటీకి చెందిన సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రామంలో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలపై కమిటీ సభ్యులు ఏ రకమైన నిర్ణయం తీసుకొన్నారనే విషయమై చర్చిస్తారు.ఎర్రవెల్లి గ్రామం తరహలోనే వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఈ మేరకు గ్రామ కమిటీ చిత్తశుద్దితో పనిచేయాలన్నారు.