కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్, ఈటెలకు చుక్కలు: నాగార్జునసాగర్ వ్యూహమే
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా వల్ల ఖాళీ అయ్యే హుజూరాబాదులో విజయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా ఆయన కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్ లతో చర్చలు జరిపారు.
హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చుక్కలు చూపించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహరచన చేశారు. హుజూరాబాద్ లో కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే అనుసరించాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యూహరచన కూడా చేసినట్లు చెబుతున్నారు.
ఆదివారం నుంచే కేసీఆర్ తన వ్యూహరచనను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు.
తన వ్యూహరచనలో భాగాంగా హుజూరాబ్ద, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో పాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు మంత్రులను బాధ్యులుగా నియమించాలని కేసీఆర్ అనుకుంటున్ారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను దించాలని యోచిస్తున్నారు.
ఈటెల రాజేందర్ ఈ రోజు శనివారం స్పీకర్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించున్నారు. దీంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారనుంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. అయినా కూడా ఇప్పటి నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
గత ఏడేళ్ల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల కింద ప్రయోజనం పొందినవారి వివరాలతో జాబితా రూపకల్పనకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యపై, పెండింగ్ అంశాలపై కూడా నివేదిక సమర్పించాలని జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు.