పక్క రాష్ట్రం పంచాయితీలు పెడుతోంది: కేసీఆర్
పక్క రాష్ట్రం అనేక పంచాయితీలు పెడుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.కేంద్రంలోని పాలకులకు రాజకీయ ప్రాధమ్యాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు
హైదరాబాద్: పక్క రాష్ట్రం అనేక పంచాయితీలు పెడుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.కేంద్రంలోని పాలకులకు రాజకీయ ప్రాధమ్యాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకొంటుందని ఆయన విమర్శలు గుప్పించారు.
ఓటాన్ బడ్జెట్పై చర్చ సందర్భంగా శనివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.2028 నాటికి తెలంగాణలో సుమారు 38 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వ అప్పులు ప్రైవేట్ అప్పుల మాదిరిగా ఉండవన్నారు. అప్పుల వల్ల భారం పడుతోందని చెప్పడం సరికాదన్నారు. సమాఖ్య స్పూర్తితో పనిచేస్తామని మోడీ చెప్పారు. కానీ, ఆ స్పూర్తితో కేంద్రం పనిచేయడం లేదని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. గుణాత్మక మార్పు రావడం లేదన్నారు.
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకు రానున్నట్టు ఆయన చెప్పారు. కాళేశ్వర, సీతారామ ప్రాజెక్టులకు అన్ని రకాలు అనుమతులు వచ్చినట్టు ఆయన వివరించారు. కౌలు దారులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయబోమని చెప్పారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ అసెంబ్లీలో తన ప్రసంగం సందర్భంగా మరోసారి పరోక్షంగా చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.