సారాంశం

మంచిర్యాల జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. 

మంచిర్యాల జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ను కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పటి నుంచో వుందని.. ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. తలసారి ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు. ఆరున్నర సంవత్సరాల క్రితం నాటి ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయన్నారు.

రెండేళ్లు కరోనా ప్రజలను అతలాకుతలం చేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత గోర్రెల పంపకాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కరోనా ఇబ్బందులను సైతం ఎదుర్కొని అభివృద్ధిలో ముందుకు సాగామని కేసీఆర్ వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని సీఎం తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ ముందంజలో వుందన్నారు. కులవృత్తుల వారికి ఆసరాగా నిలుస్తున్నామని సీఎం తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు కేసీఆర్. 

అంతకుముందు కేసీఆర్ పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మందమర్రిలో రూ.500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు, హాజిపూర్ మంలంలోని పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 

ఇకపోతే.. మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా రూ.60 లక్షలతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు.