Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ సిగలో తీగలమణిహారం... తుది దశకు కేబుల్ బ్రిడ్జీ పనులు...(వీడియో)

ప్రస్తుతం వంతెన పై లోడ్ టెస్ట్ కొనసాగుతుండగా, మరోవైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు సైతం వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లోడ్ టెస్ట్ పూర్తై, అప్రోచ్ రోడ్లు పూర్తైతే, త్వరలోనే కేబుల్ బ్రిడ్జీ పైకి పర్యాటకులను అనుమతించనున్నారు. 

Karimnagar cable bridge undergoing load tests - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 2:01 PM IST

కరీంనగర్ సిగలో ఆకర్షణీయంగా నిలిచేందుకు తీగల మణిహారం సిద్దమయ్యింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో... అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు. 

"

ప్రస్తుతం వంతెన పై లోడ్ టెస్ట్ కొనసాగుతుండగా, మరోవైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు సైతం వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లోడ్ టెస్ట్ పూర్తై, అప్రోచ్ రోడ్లు పూర్తైతే, త్వరలోనే కేబుల్ బ్రిడ్జీ పైకి పర్యాటకులను అనుమతించనున్నారు. 

ఆది నుంచి ఉద్యమంలో కలిసి వచ్చిన కరీంనగర్ అంటే సిఎం కెసిఆర్ కు వల్లమాలిన అభిమానం... హ్యాట్రిక్ విజయాలను అందించి... అసెంబ్లీకి పంపించిన కరీంనగర్ అభివృద్దికి ఏదో చేయాలనే మంత్రి గంగుల కమలాకర్ తపన... దీంతో... సిఎం హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కెసిఆర్... కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. ఇందుకోసం కేబుల్ బ్రిడ్జీ... మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మించాలని తలపెట్టారు. అయితే సిఎం కెసిఆర్ ఆశయాలు... ఆకాంక్షలకు అనుగుణంగా... మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకుంటున్నారు. 

అటు హైదరాబాద్, ఇటు వరంగల్ వెళ్ళాల్సిన వాహనాలన్ని కూడా అలుగునూర్ బ్రిడ్జీ పై నుండి వెళ్ళాల్సి వస్తుండడంతో... తరచు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో... ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... వరంగల్ కు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే మంచిదని పాలకులు భావించారు. ఈ కొత్తగా నిర్మించే రోడ్డు వరంగల్ తో పాటు దక్షిణ భారతాన్ని కలిపే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. 

ఆకాంక్షలకు అనుగుణంగా... కరీంనగర్- సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ మార్గం పై 149 కోట్ల రూపాయలతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండి వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటుంది. పర్యాటకులకు తియ్యని అనుభూతిని పంచి... మనస్సులను దోచుకునేందుకు సిద్దమవుతుంది.  ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలిచి... పర్యాటక శోభను పంచనుంది.

ఇలాంటి కేబుల్ బ్రిడ్జీలో ఉత్తర భారతదేశంలోని హౌరా... ముంబైలలో రెండు ఉండగా... దక్షిణ భారతంలోనే తొలిసారి... దేశంలో 3వ కేబుల్ బ్రిడ్జీ ఇదిగో ఇక్కడ నిర్మాణమవుతుంది. అత్యంత ఆధునికంగా సుందరంగా నిర్మాణమవుతున్న ఈ కేబుల్ బ్రిడ్జీ... ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లను తగ్గించనుంది. 

వెయ్యి టన్నుల కెపాసిటీ ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జీ పై ఎంతటి బరువైన వాహనాలైన వెళ్ళేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. అంతే కాకుండా... ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను డిస్ ప్లే చేసేందుకు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

ఇప్పటికే కేబుల్ బ్రిడ్జీ పనులు పూర్తికాగా... వంతెన పై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు... ఫుట్ పాత్ పై ప్రజలు వెళ్ళడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని... శుక్రవారం నుండి బ్రిడ్జీ పై లోడ్ టెస్ట్ ను ప్రారంభించారు. 

ఈ లోడ్ టెస్ట్ మంగళవారం వరకు అంటే 5 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో ఏమైన సమస్యలు తలెత్తితే... వెంటవెంటనే పరిష్కరించడంతో పాటు... లోడ్ టెస్ట్ అనంతరం వంతెన పైకి వాహనాలను అనుమతించనున్నారు. 

వంతెన పై ఇరువైపుల 28 టిప్పర్లను నిలిపి... ఒక్కో టిప్పరులో 30 టన్నుల బరువు ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 840 టన్నుల ఇసుక బరువుతో పాటు... వంతెన ఇరువైపులా ఫుట్ పాత్ ల పై 110 టన్నుల ఇసుక సంచులను వేశారు. 

వంతెన పై మొత్తం 950 టన్నుల బరువును ఉంచి... వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి... 24 గంటల పాటు పరీక్షించనున్నారు.  ఇలా శనివారం వరకు పరిశీలన చేసి... ఆదివారం సెలవు ఇచ్చారు. మళ్ళీ సోమ, మంగళవారాల్లో 20 వాహనాల్లో ఇసుకను నింపి... ఫుట్ పాత్ ల పై ఇసుక బస్తాలు పెట్టి... మళ్ళీ వంతెన సామర్ధ్యాన్ని అంచనా వేస్తున్నారు. పరిశీలన మొత్తం పూర్తయ్యాకా... ఏమైన సమస్యలు దృష్టికి వస్తే.... తీసుకోవల్సిన చర్యలు చేపట్టనున్నారు. 

ఇది ఇలా ఉంటే... కేబుల్ బ్రిడ్జీ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు... కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందుకోసం 34 కోట్ల రూపాయలతో విశాలమైన రోడ్లను నిర్మించనున్నారు. కరీంనగర్ కమాన్ నుండి సదాశివపల్లి వరకు తీగెల వంతెన నిర్మాణం పోగా... మిగతా 4.7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు... అలాగే సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జీ వరకు రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తైతే... వెంటనే తీగల వంతెన పైకి వాహనాలు వెళ్ళేందుకు అనుమతించనున్నారు.

సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేబుల్ బ్రిడ్జికీ... ఆదునాతనమైన లైటింగ్ మరింత శోభను తీసుకురానున్నారు. 8 కోట్ల రూపాయలతో రాత్రి వేళల్లో పర్యాటకులను అలరించే విధంగా తీగల వంతెన పై రంగు రంగుల డిజిటల్ లైటింగ్... ఇతర ఆకర్షణీయ పనులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన వెంటనే ఆ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయనున్నారు. 

మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కేబుల్ బ్రిడ్జీ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

ఇప్పటికే మానేర్ రివర్ ఫ్రంట్ కోసం పాలకులు 410 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఎమ్మారెఫ్ నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి. ఇప్పటికే ఏఈకమ్ ప్రతినిథులు సర్వే పనులను పూర్తి చేయగా, జులై మాసాంతం లోగా డిపిఆర్ పూర్తై, ఆగష్టులో నిర్మాణం పనులు పూర్తి కానున్నాయి. 

పంచముఖ ద్వారాలతో అలరారుతున్న కరీంనగరానికి కేబుల్ బ్రిడ్డీ అందుబాటులోకి వచ్చిన తరువాత షట్ ముఖ ద్వారాలతో కరీంనగరానికి పర్యాటక కేంద్రంగా ప్రత్యేక శోభ రానుంది. అటు సిఎం కెసిఆర్ ఆశయాలు... ఇటు మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ది పథాన దూసుకెళ్ళనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios