Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి : రంగంలోకి ఎస్పీ, లోనికి ఐదుగురికే అనుమతి.. కలెక్టర్ రావాల్సిందేనంటూ రైతుల పట్టు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. ఐదుగురిని లోపలికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. 

kamareddy sp srinivas reddy negotiations with farmers
Author
First Published Jan 5, 2023, 6:39 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ రైతులు కొన్ని గంటలుగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో గేట్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు అన్నదాతలు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు రైతులను బుజ్జగించేందుకు జిల్లా ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపిన ఆయన.. గాంధేయ మార్గంలో ఆందోళన చేయాలని హితవు పలికారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఇంకా ఆమోదం పొందలేదని.. రైతుల తరపున ఐదుగురు వస్తే కలెక్టర్‌తో చర్చలు జరిపిస్తామని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రైతులపై తమకు ఎలాంటి కోపం లేదని.. కలెక్టర్ రైతుల దగ్గరకు రారని, రైతులే కలెక్టర్ వద్దకు వెళ్లాలని ఎస్పీ కోరారు. అయితే రైతులు మాత్రం పట్టువీడటం లేదు. కలెక్టరే తమకు దగ్గరికి వస్తే ఆందోళన విరమిస్తామని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కలెక్టర్ జితేష్ పాటిల్ మాత్రం తన ఛాంబర్‌లోనే వున్నారు. 

కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. కొత్త మాస్టర్ ప్లాన్ ను  వెంటనే వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద గురువారంనాడు  రైతులు ఆందోళన నిర్వహించారు . కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు  రైతులు  ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలోకి  ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు.ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి  ఇండస్ట్రీయల్ కారిడార్ కు  కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనోపాధిని కల్పించే  భూములను ఇవ్వబోమని రైతులు  చెబుతున్నారు.  

ALso REad: కామారెడ్డిలో రైతుల ఆందోళన తీవ్రతరం.. కలెక్టర్ మొండిపట్టు వల్లే ఇలా, తమతో మాట్లాడాల్సిందేనంటోన్న అన్నదాతలు

మరోవైపు.. తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు  నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ఎనిమిది గ్రామాల రైతులు  ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని  ఆందోళనకు దిగారు. తాము భూములను  వదులుకొనే ప్రసక్తేలేదని  రైతులు చెప్పారు.ఇదిలా ఉంటే  రైతులకు మద్దతుగా  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  రవీందర్ రెడ్డిలు సైతం  ధర్నాలో  పాల్గొన్నారు.  

అయితే రైతుల ఆందోళన తీవ్రరూపు దాల్చడానికి కలెక్టర్ జితేష్ పటేల్ మొండివైఖరే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతులతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ వున్నారు. రైతుల ముట్టడితో కలెక్టరేట్ హోరెత్తుతున్నా విషయాన్ని పోలీసులకే వదిలేశారు కలెక్టర్. రైతు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడంతో ఆయనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడేదాకా ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కలెక్టర్ వచ్చి తమ నుంచి వినతిపత్రం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios