జీతాలు పెంచాలని జూడాల లేఖ: సమ్మె చేస్తామని తెలంగాణ సర్కార్కి హెచ్చరిక
గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు 15 శాతం జీతాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు లేఖ రాశారు.
హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు 15 శాతం జీతాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. రెండు వారాల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని జూడాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.
కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు.గత ఏడాది కరోనా సమయంలో జూడాలు తమ డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు. ఆ సమయంలో ప్రభుత్వం జూడాల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. కరోనా రోగులకు వైద్య చికిత్స అందించడంలో జూడాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలో జూడాలు సమ్మెకు దిగితే కరోనా రోగులకు వైద్యచికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.