ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిజామాబాద్, నిర్మల్  కేసులకు సంబంధించి తీర్పులను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

హైదరాబాద్: ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన రెండు వివాదాస్పద కేసుల్లో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు . 

ఎంఐఎం శాసనసభపక్షనేత Akbaruddin చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై Nampally Court విచారిస్తుంది. నిర్మల్ తో పాటు, నిజామాబాద్ లో జరిగిన వేర్వేరు కేసులకు సంబంధించి తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ రెండు కేసుల్లో 30 మందికిపై గా సాక్షులను కోర్టు విచారించింది.తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తోసిపుచ్చారు.అయితే ఈ కేసులో అప్పటి పోలీసు అధికారులను కూడా కోర్టు విచారించింది. అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కోర్టులో పోలీసులు సాక్ష్యం చెప్పారు. 2012 లో అక్బరుద్దీన్ పై కేసు నమోదైంది. 120 బీ, 153ఏ, 295 ఏ, 298, 188 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

2012 డిసెంబర్ 22న Nirmal లోని NTR స్టేడియంలో నిర్వహించిన సభలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాకు 15 నిమిషాలు అప్పగిస్తే ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో చూపిస్తామని వ్యాఖ్యానించారు. మీరు 100 కోట్లు, మేం 25 కోట్లుంటాం, 15 నిమిషాలు మాకు అప్పగిస్తే ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో చూపిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపాయి.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. లండన్ నుండి వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో 40 రోజుల పాటు అక్బరుద్దీన్ ఓవైసీ జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ Bail పొందాడు.

హేట్ స్పీచ్ తనది కాదని అక్బరుద్దీన్ ఓవైసీ కోర్టుకు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది అక్బరుద్దీనేనని సీఐడీ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు. మరో వైపు నిజామాబాద్ జిల్లాలో ఓ వర్గానికి చెందిన దేవతలను అక్బరుద్దీన్ దూషించారని కూడా ఆయనపై కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు.

ఈ రెండు కేసుల్లో తీర్పులు వచ్చే అవకాశం ఉన్నందున అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ నాంపల్లి కోర్టుకు వచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీపై కోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు బందోబస్తును పెంచారు. నాంపల్లి కోర్టు వద్ద కూడా ఎంఐఎం కార్యకర్తలు, అక్బరుద్దీన్ అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు. తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేయడంతో న్యాయస్థానం నుండి అక్బరుద్దీన్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు వెళ్లిపోయారు.