కోరిక తీర్చాలని బలవంతం: యువతిని చంపిన ప్రమోన్మాది
కడప జిల్లా బద్వేల్ మండలంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రేమోన్మాది 18 ఏళ్ల యువతిని హత్య చేశాడు. అది గమనించి అతన్ని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు.
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని బద్వేల్ మండలంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువకుడు గొంతు కోసి యువతిని హత్య చేశాడు.
బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 18 ఏళ్ల కూతురు శిరీష్ ఉంది. ఆమె బద్వేలు వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చరణ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ కొద్దికాలంగా ఆమె వెంటపడుతున్నాడు. సెలవులు కావడంతో ప్రస్తుతం ఆమె ఇంటి వద్దనే ఉంటోంది.
చరణ్ శుక్రవారం చింతలచెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. శిరీష్ అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన గ్రామస్తులు చరణ్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదాదారు
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన చరణ్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.