తెలంగాణలో ఆర్టీసీ సమ్మె... స్పందించిన పవన్
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తొలగంపు నిర్ణయం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకోని పరిశీలించాలే తప్ప... కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. గత నాలుగు రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. సమ్మె చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 1200మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తలను చూస్తే కలవరానికి గురిచేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఉద్యోగులపట్ల ఉదారత చూసి ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ని కోరుతున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.