సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎంనవుతా అంటూ చెప్పుకొచ్చారు. 

సంగారెడ్డి : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు  రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో నిర్వహించిన విజయదశమి ఉత్సవ  వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలకు తెరలేపాయి. వచ్చే పదేళ్లలో తెలంగాణకు తాను ముఖ్యమంత్రిని అవుతానని జగ్గారెడ్డి అన్నారు.  ‘విజయదశమి సందర్భంగా ఈరోజు నేను నా మనసులోని మాట చెబుతున్నానని’ చెప్పుకొచ్చారు.

‘సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని… జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని..’ దీన్ని ఎవరైనా కాదనగలరా అంటూ.. ప్రశ్నించారు. ఈ విజయోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను చెప్పేవాడినని.. జగ్గారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. 

జగ్గారెడ్డి అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని తెలిపారు. ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని ఒకవేళ నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినప్పటికీ తన అనుచరులు, తన భార్య ఉంటారని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతానని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తన మీద ఉండాలని ఆయన కోరారు.