లతా మంగేష్కర్ మృతి పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటు అని పేర్కొన్నారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (lata mangeshkar) మృతితో సంగీత ప్రపంచం ఒక్క సారిగా మూగబోయింది. ఆమె మృతి పట్ల దేశం మొత్తం శోకసంద్రంలో కూరుకుపోయింది. రాబోయే రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం (tribute) ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (etela rajendar) తన ట్విట్టర్ ద్వారా లతామంగేష్కర్ నివాళి (tribute) అర్పించారు. ‘‘ప్రముఖ గాయిని (స్వర్ణ కోకిల) లతా మంగేష్కర్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రముఖ గాయినిగా 980 సినిమాలకు, 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భారత ప్రభుత్వం చేత భారత రత్న పద్మ విభూషణ్ వంటి అనేక పురస్కారాలు వారు అందుకున్నారు. వారి మరణం సినీ సంగీత లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంభ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ ఈటెల రాజేందర్ ట్వీట్ చేశారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (tpcc presiedent revanth reddy) కూడా లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. ‘‘ మీ స్వరం శాశ్వతం... మీరు మీ పాటల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు.. #లతామంగేష్కర్ జీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
గత కొంత కాలంగా లతా మంగేష్కర్ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను బ్రీచ్ క్యాండీ (breach kyandi) హాస్పిటల్లో ఈ నెల 8వ తేదీన చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూ (icu)లోనే ఉన్నారు. అయితే కొంత కాలం తరువాత ఆమె ఆరోగ్యం కుదటపడినప్పటీ.. తరువాత మళ్లీ క్రమంగా దిగజారింది. ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ భౌతిక దేహాన్ని పెద్దార్ రోడ్డులోని ఆమె నివాసం ప్రభుకుంజ్కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆమె భౌతిక దేహాన్ని నివాళుల కోసం అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత ముంబయిలోని శివాజీ పార్క్కు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తరలించనున్నారు. శివాజీ పార్క్ (shivaji park)లోనే ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
