రెండున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీ వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. 

ఓ ఐటీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోవడం గమనార్హం. కాగా.. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా తొగుట మండటం పెద్ద మాసాన్ పల్లిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పన్యాల భాస్కర్‌రెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌రెడ్డి (23) బీటెక్‌ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీ వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. 

ఈ క్రమంలో గ్రామంలో సరిగా సిగ్నల్‌ రాకపోవడంతో వ్యవసాయ బావి వద్ద గదిలో ఉండి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే పనిచేస్తున్నాడు. రోజురోజుకూ పనిభారం పెరగడంతో మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఉద్యోగం మానేస్తానని తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు నీకు ఎలా నచ్చితే అలా చేయమని సర్దిచెప్పారు. రెండు రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే బాధ పడతారని చెప్పకుండా దాచాడు. 

రాజీనామా చేశాక తీవ్ర మానసిక వేదనకు గురైన నవీన్‌రెడ్డి.. శుక్రవారం ఉదయం తండ్రితో పాటు ఉదయం పని ఉందంటూ వ్యవసాయ బావి వద్ద వెళ్లాడు. తండ్రి గేదెల పాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఉదయం 8.30 గంటల సమయంలో రెండో కుమారుడు అజయ్‌ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పట్టు పురుగుల షెడ్‌లో ప్లాస్టిక్‌ తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు. తొగుట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.